APL 2026: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 5వ సీజన్ విశాఖపట్నంలో ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా టోర్నీని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టోర్నీకి శ్రీకారం చుట్టారు.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో కాకినాడ కింగ్స్ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్పై 71 పరుగుల భారీ తేడాతో భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన కాకినాడ కింగ్స్ సీజన్ను విజయంతో ఆరంభించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువన్ సిక్సర్లతో అలరిస్తూ అర్ధశతకంతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అతనికి తోడుగా అభిషేక్, అర్జున్, తపస్వి, మనీష్, లక్షజ్ రెడ్డి వేగంగా పరుగులు సాధించడంతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఇక 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. కాకినాడ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు లయన్స్ బ్యాటర్లు నిలువలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన జట్టు 18.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది.
కాకినాడ బౌలర్లలో ఆంజనేయులు మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు అద్భుత అర్ధశతకంతో మ్యాచ్ ఫలితాన్ని మలుపుతిప్పిన యువన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

