AP Social Media Cases: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. ఇప్పటివరకు ఉపసంఘం రెండుసార్లు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చర్యలను సమీక్షించినట్లు చెప్పారు. మన రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే సమర్థవంతంగా ఉంటాయన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. విద్వేషపూరిత, అసభ్య పోస్టుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సోషల్ మీడియా పోస్టులపై 1,384 కేసులు నమోదు చేసినట్లు మంత్రి అనిత వెల్లడించారు. ఇందులో 1,067 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాల కట్టడికి కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మరోవైపు 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కూడా వెల్లడించారు హోం మంత్రి అనిత..