Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో వరుసగా సమ్మెలు సాగుతున్నాయి.. ఓవైపు కార్మిక, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ.. సమ్మెలకు ముగింపు పలుకుతూ వస్తుంది ప్రభుత్వం.. అయితే, ఇప్పుడు మరోసమ్మె తెరపైకి వచ్చింది.. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మె బాట పడతామని ఏపీఎన్జీవోలు హెచ్చరించారు.. దానికి సంబంధించిన ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించారు.. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై దృష్టిసారించింది ఏపీ ప్రభుత్వం.. అందులో బాగంగా ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల బృందం పాల్గొననుంది.. కాగా.. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. పెండింగ్ డీఏలతో పాటు రిటర్మైంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు పడుతున్నాయి ఉద్యోగ సంఘాలు…
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
ఈ రోజు ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయని.. అవి సఫలం కాకపోతే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు.. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆ చర్చల్లో ఉద్యమకార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈనెల 14న నల్ల బ్యాడ్జిలు ధరించి అన్ని కార్యాలయాల్లో మెమొరాండాలు ఇస్తామని తెలిపారు. 15, 16వ తేదీలలో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టబోతున్నామని చెప్పారు. 17న తాలుఖా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహణ.. 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా, 21నుండి 24 వరకు అన్ని జిల్లాల పర్యటన చేస్తామని.. 27న జరిగే చలో విజయవాడ చేస్తామని తెలిపారు. ఇక, అప్పటికి స్పందించకపోతే ఏ నిమిషంలోనైనా మెరుపు సమ్మె చేపడతామని హెచ్చరించారు.. 12th పీఆర్సీ కమీషన్ ఎక్కడుందో తెలీదు.. పీఆర్సీ పట్ల చిత్తశుద్దిలేదని ఆరోపించారు. రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉందని.. జీపీఎఫ్ బిల్లులు చెల్లింపులు లేవని బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతినెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు.. అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో.. ఉద్యోగుల ఆందోళనకు ఫులిస్టాప్ పెట్టేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ఈ రోజు చర్చలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.