NTV Telugu Site icon

Minister Satyakumar: ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన ఏపీ మంత్రి సత్యకుమార్

Satyakumar

Satyakumar

Satyakumar: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చ జరిగిందని ఆయన భేటీ అనంతరం మీడియాతో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు. సంస్థాగతంగా పార్టీ విస్తరించేందుకు ప్రయత్నాలు చేయాలని చూస్తున్నామని.. జాతీయస్థాయిలో అధ్యక్ష మార్పులుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో మార్పులు ఉంటాయా లేదా అన్నది తాను చెప్పలేనన్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సత్యకుమార్‌.. ఎన్‌హెచ్‌ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ‘ఆరోగ్య మందిర్’ భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 40 రోజుల పాలనలో రాష్ట్ర సర్కారు తీసుకున్న తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి తాను వివరించానని సత్యకుమార్ పేర్కొ్న్నారు.

Read Also: Venkaiah Naidu: రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..ఎందుకంటే..

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశానన్న ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్.. 11 టీచింగ్ మెడికల్ కాలేజీలు ఉంటే, 6 కాలేజీల్లో మాత్రమే క్యాత్ లాబ్స్ ఉన్నాయని.. మిగతా 5 కాలేజీలకు క్యాథ్ లాబ్స్ మంజూరు చేయాలని కోరానన్నారు. క్యాన్సర్‌కి సంబంధించి మరికొన్ని కేంద్రాలు మంజూరు చేయాలని కోరానని ఆయన వెల్లడించారు. ఎన్‌హెచ్‌ఎం నుంచి నిధులు మంజూరు చేసే ప్రొవిజన్ లేదన్నారు. అయితే రూ. 300 కోట్లు మంజూరు చేయాలని కోరాను. సానుకూలంగా స్పందించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను పాత జిల్లాల లెక్కన మంజూరు చేశారని..కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఆ ప్రకారం మంజూరు చేయాలని కోరానన్నారు. గ్రామీణ ఆరోగ్య మందిర్ల నిర్మాణానికి సహకారం అందించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య మందిర్లలో సిబ్బందికి జీతాలు చెల్లించడం కోసం రూ. 1,000 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించాలంటే ఇవన్నీ అమలు చేయాలని చెప్పానన్నారు.

ఉచిత ఇసుక, సామాజిక భద్రత స్కీమ్స్ తదితర పథకాల గురించి చెప్పానన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకుని వెళ్తున్నారని.. అమరావతి రింగ్ రోడ్డు ప్రాజెక్టు సామాన్య విషయం కాదన్నారు భారత్ పెట్రో రిఫైనరీ, విశాఖ మెట్రో రైల్.. ఇలా అనేక విభజన హామీలను సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం అమరావతిని స్మశానం చేయడం కోసం పనిచేసిందని.. రింగ్ రోడ్ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయేవన్నారు.విశాఖపట్నం మెట్రో విషయంలో డీపీఆర్ రివైజ్ చేసి పంపించమంటే ఇంతవరకు గత ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. విశాఖను పాలనా రాజధాని అన్నారు తప్ప చిత్తశుద్ధి ప్రదర్శించలేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాజకీయ వివక్ష లేకుండా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అధికారం కోల్పోయి 2 నెలలు కూడా కాకముందే మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాతీర్పుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం సీజనల్ వ్యాధుల గురించి ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

“ఏప్రిల్ నెల నుంచే ఈ ఏర్పాట్లు చేయాలి. మేం అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు.మేము అధికారంలోకి వచ్చాక ఉదాసీనత లేకుండా పనిచేస్తున్నాం. జగ్గయ్యపేటలో ఐదేళ్లుగా క్లోరినేషన్ జరగలేదు. ఫిల్టర్లు మార్చలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకుకు నిచ్చెన లేకపోవడం వల్ల క్లోరినేషన్ జరగడం లేదని ఒక చోట చెప్పారు నిర్వహణ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది తలెత్తుతుందో ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ జింక్ ట్యాబ్లెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాల కోసమే విమర్శలు చేస్తున్నారన్నది గమనించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సంక్షేమం అసాధ్యం. అయినా సరే సంక్షేమం, అభివృద్ధి – రెండూ చేస్తున్నాం.” అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

Read Also: Bhatti Vikramarka : ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం

పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తల విషయంలో గత ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మా ప్రభుత్వం ఒక కమిటీ వేయాల్సి వచ్చిందన్నారు. మీరు దోచుకున్న భూములకు చట్టబద్ధత కల్పించుకోవడం కోసం ఒక చట్టాన్ని తెచ్చి, కేంద్ర ప్రభుత్వం (నీతిఆయోగ్) సూచించిందని చెబుతున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు పారిపోకుండా నిర్మాణాత్మక చర్చ జరిగేలా సహకరించాలని కోరుతున్నామన్నారు. ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా వ్యవహరించేలా ఐదేళ్లలో విధ్వంసం జరిగిందన్నారు. అధ్యయనం చేయకుండా అడ్డగోలుగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని.. వాటికి నిధులు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. చాలావాటికి కేంద్రం వివిధ స్కీముల ద్వారా, నాబార్డ్ ద్వారా నిధులు అందజేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సింది ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు.

మెడికల్ ఇన్సూరెన్స్ ను హైబ్రీడ్ మోడల్‌లో ప్రజలకు రూ. 25 లక్షల మేర లబ్ది పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, మెడికల్ ఇన్సూరెన్సులను కలిపి పనిచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. శ్వేతపత్రాలు ప్రతి శాఖలోనూ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద అదనంగా రూ. 1,000 కోట్లు ఎన్వలప్ కింద ఇవ్వాలని కోరామని.. మామూలుగా రూ. 2,300 కోట్లు, అదనంగా మరో రూ. 500 కోట్లు వస్తున్నాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీల్లో ఉన్న లోటుపాట్ల కారణంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ క్లియరెన్సులు ఇవ్వలేదన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యం లేదా పీపీపీ మోడల్.. ఇలా అనేక రకాల ఆప్షన్ల ద్వారా కొత్త మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ జరపడం కోసం మొదటి సంతకం చేశామని చెప్పారు. క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రభుత్వంపై ట్రీట్మెంట్ భారం కూడా తగ్గుతుందన్నారు.