ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతును ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చొప్పున ఉల్లిని కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని.. ఉల్లిని ఆరబెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు.
Also Read: Ravi Naidu: రోజా అయినా, బైరెడ్డి అయినా.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు!
‘వర్షాలతో ఉల్లి పంట దెబ్బ తినడం, మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువగా ఉన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉంది. క్వింటా ఉల్లిని రూ.1200 చొప్పున కొనుగోలు చేయండి. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలి. ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలి. ఉల్లికి రేటు వచ్చేంత వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి. ఉల్లి రైతు నష్టపోకూడదు, వినియోగదారుడు ఇబ్బంది పడకూడదు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి’ అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.
