Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ఏక సభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను విచారణ కమిషనర్గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో వన్ మెన్ కమిటీ ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేపట్టనుంది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలాగే జరిగిన లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయా..? నాణ్యత తనిఖీలలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా..? అనే అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఇక, ప్రభుత్వం కమిటీకి 45 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో ఈ వ్యవహారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పారదర్శక విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని భక్తులు ఆశిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు కొనసాగుతోన్న తరుణంలో.. తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది..