Deputy CM Pawan Kalyan: గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. విజయవాడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అందుతున్న తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం అధికారులతోనూ సమీక్ష జరిపారు. సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు. సుమారు రెండున్నర గంటల సేపు సమీక్ష సమావేశం సాగింది.
ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రొటోకాల్ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ నిధులు ఏ మాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.