AP CM Chandrababu: కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సుతిమెత్తని హెచ్చరిక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సామాన్యుల కంటే పదవులు పొందిన వారు ప్రత్యేకం కాదనే స్పృహతో పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల విషయంలో కామెంట్లు చేసిన వారికి సీఎం క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత అని.. ఎక్కడా అహంకారం కనిపించకూడదని సీఎం పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులు అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల కంటే మనం ప్రత్యేకం అని భావించకూడదన్నారు. మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారన్నారు. మన ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హూందాగా ఉండాలని సీఎం సూచించారు. ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చామన్నారు. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించాం.. మంచి ఫలితాలు వచ్చాయన్నారు. నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించామన్నారు.
Read Also: Minister BC Janardhan Reddy: మౌలిక సదుపాయాల కల్పన ఆర్థికాభివృద్ధికి వెన్నెముక
ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగామని.. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి.. లిస్టులు ఉంటాయన్నారు. కొందరు నాయకులు తొందర పడుతున్నారు.. ఇది మంచి పద్దతి కాదన్నారు. మన పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలన్నారు. పార్టీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంత వరకు అవకాశం ఇచ్చామన్నారు. కష్టపడిన వారికి మొదటి లిస్టులో ముందుగా అవకాశాలు ఇచ్చామన్నారు. మీకు అవకాశాలు వచ్చాయి అంటే.. మిగిలిన వారు పనిచేయలేదని కాదని.. అర్హత లేదు అని కాదన్నారు. జైలుకు వెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పొయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారన్నారు. పార్టీకి ఎవరు ఎలా పని చేశారో తమ దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లు ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి అనే విషయంలో స్పష్టంగా ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించమన్నారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించామన్నారు. జనాభా దామాషా లెక్కన బిసిలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
Read Also: Minister Payyavula: కల్తీ నెయ్యి నిజం, అపచారం జరిగిందనేది నిజం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
“మీ విభాగాలపై ముందుగా బాగా స్టడీ చేయండి. ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు అనేవిషయాలపై లోతుగా కసరత్తు చేయండి. పెట్టుబడుల రాబడట్టడంలో పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఏపీఐఐసీ పాత్ర కీలకం. మౌళిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చు. మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే.. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసింది. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి… కానీ జగన్ ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చాడు.ఆర్టీసీని నిలబెట్టాలి.. ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి.. కార్గో పెంచాలి. నేతలకే కాదు.. ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్లలో అవకాశాలు ఇచ్చాం. బాగా పని చేయండి.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి.మనకు వచ్చిన విజయాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరు పనిచెయ్యాలి. సింపుల్ గవర్నమెంట్. ఎఫెక్టివ్ గవర్నెర్స్ అని నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. అదే అంతా పాటించాలి.15 రోజుల్లో వరద సాయం అందించాం.. మళ్లీ బాధితులను నిలబెట్టే ప్రయత్నం చేశాం.ఇది మన విధానం..దీనికి అనుగుణంగా మీరు పనిచేయాలి.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలతో కలిసి, సమన్వయంతో మీరంతా పనిచేయాలని కోరుతున్నా. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి.” అని సీఎం చంద్రబాబు సూచించారు.