NTV Telugu Site icon

CM Chandrababu: రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: రాష్ట్రంలో చేపట్టిన అన్ని రైల్వే ప్రాజెక్టులు నిర్దేశిత లక్ష్యంతో త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.72 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారని.. దానికి అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టి, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సీఎం అన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రైల్వే లైన్ల పనులు, భూసేకరణ, ఆర్థిక అవసరాలు వంటి అంశాలపై రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయా ప్రాజెక్టుల్లో జాప్యానికి కారణాలను తెలుసుకుని పరిష్కారంపై చర్చించారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రైల్వే ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని.. నేడు అన్ని ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూసేకరణ సమస్యలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టుల సత్వర పూర్తికి, భూసేకరణ సమస్యల పరిష్కారానికి రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే లైన్ కు నాలుగు నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Read Also: Minister Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు.. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

నడికుడి – శ్రీకాళహస్తి మార్గంలో 11 ఎకరాల భూసేకరణకు రూ.20 కోట్లు వెంటనే ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. సత్తుపల్లి – కొవ్వూరు లైన్‌కు భూ సేకరణ పూర్తి చేసి ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. కడప- బెంగుళూరు లైన్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయని…దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రేణిగుంట- గూడూరు 83 కి.మీ 3వ లైన్ పనులు రూ.884 కోట్లతో చేపట్టాలని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 4 నెలల్లో భూ సేకరణ పూర్తి చేసి మూడు ఏళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తిచెయ్యాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదలై పనులు జరుగుతున్న అన్ని రైల్వే ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే డబ్లింగ్ పనులు నాలుగేళ్లలో పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి తెలిపారు. గుంటూరు – గుంతకల్ డబ్లింగ్ పనుల కింద చేపట్టిన 401 కిలోమీటర్ల లైన్ పనులను 12 నెల్లలోనే పూర్తి చెయ్యాలన్నారు. అమృత్ ప్రాజెక్టు కింద కుప్పం రైల్వే స్టేషన్ ను రూ.6.98 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని అధికారులు తెలపగా…స్టేషన్ డిజైన్లు మెరుగుపరచాని సీఎం సూచించారు. రూ.433 కోట్లతో విశాఖపట్నం స్టేషన్, రూ.24 కోట్లతో విజయవాడ గుణదల స్టేషన్ పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుణదల స్టేషన్ పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే, రూ.40 కోట్లతో జరగుతున్న గుంటూరు స్టేషన్ అభివృద్ది పనులు, కర్నూలు స్టేషన్ అభివృద్దిపనులు వెంటనే పూర్తి చెయ్యాలన్నారు. మొత్తం 72 స్టేషన్లలో రూ.3,170 కోట్లతో జరుగుతున్న అభివృద్ది పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.

ఎర్రుపాలెం -అమరావతి – నంబూరు రైల్వే లైన్‌కు రూ.2,239 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం 390 లెవల్ క్రాసింగ్‌లు ఉండగా.. ప్రస్తుతం 83 ఆర్వోబీలు ఉన్నాయని అధికారులు వివరించారు. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయని.. 285 ఆర్వోబీలు మంజూరు కావాల్సి ఉందని అధికారులు వివరించారు. అదే విధంగా పలు ఇతర కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను అధికారులు సీఎం ముందు ఉంచారు. ఆయా మార్గాలు ఏఏ ప్రాంతాల గుండా వెళుతున్నాయి అనే విషయంలో అధికారులతో చర్చించారు. మరికొంత సమగ్ర సమాచారంతో కొత్తలైన్లపై చర్చించాల్సి ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలో రోడ్, రైల్, ఛార్జీలు ఎయిర్ నెట్ వర్క్‌లను అనుసంధానం చేస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రాజెక్టుల ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి, రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.