NTV Telugu Site icon

AP CM Chandrababu: నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి..

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేరం చేస్తే శిక్ష తప్పుదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పనిచేయాలని సీఎం అన్నారు. నేరం జరిగిన తరువాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే…అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని సీఎం అన్నారు. ప్రజల భద్రతకు ఒక భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనిచేయాలని.. పూర్తి స్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని సీఎం అన్నారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్థులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. హోం శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 46 శాతం పెరిగిన నేరాలు
సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో గత పదేళ్లలో పోలీసు శాఖలో నెల‌కొన్న పరిస్థితులపై అధికారులు వివరించారు. 2014-19 పోల్చితే 2019-24లో క్రైం రేట్ 46 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. 2014-19 తో పోల్చుకుంటే 2019-23 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్ నేరాలు 134.43 శాతం పెరిగాయని తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడించారు. గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్యమైందో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

పరికరాల ఏఎంసీకి దిక్కులేదు.. కాలం చెల్లిన‌ వాహనాలు
పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు ఉంటే అందులో 88 పనిచేస్తున్నాయని తెలిపారు. బాడీ వోర్న్ కెమెరాలు 1250 ఉంటే 444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1180 కెమేరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమెరాల్లో 2371 కెమేరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన‌ రూ. 30 కోట్లు నిధులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకాండా పోయాయని.. వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య 5215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే.. గత ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని…ప్రస్తుతం 2812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్ అవసరమ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

నిధుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకారం
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పోలీసు శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవ‌స‌ర‌మైన‌ అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్ధల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రూ.10 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటులో పెండింగ్‌లో ఉన్న రూ.11 కోట్ల బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖను ఆధునికీక‌రించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.61 కోట్లు విడుద‌ల చేయ‌డానికి కూడా సీఎం ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం పోలీసులను క్షక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుంది కానీ…..పోలీసు శాఖ సామర్థ్యం మాత్రం పెంచేలేదని అన్నారు. నేర పరిశోధనలో కీలకమైన ఫింగర్ ప్రింట్ వంటి విభాగాలకు, పరికరాలకు కనీసం రూ.10 కోట్లు యాన్యువల్ మెయింటనెన్స్ చార్జెస్ చెల్లించకపోవడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు. పోలీసు శాఖను మళ్లీ గాడిన పెడతామని.. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింద పనిచేసే ఎస్సై వరకు మార్పు కనిపించాలని సీఎం స్పష్టం చేశారు. మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలి అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, వాడకం విపరీతంగా పెరిగిందని.. డ్రోన్స్‌ను వినియోగించి గంజాయి పంట ఎక్కడ ఉందో గుర్తించి నాశనం చేయాలని అన్నారు. రాష్ట్రంలో, గంజాయి డ్రగ్స్ అనే మాట వినిపించకూడదని అన్నారు. గంజాయి లేని రాష్ట్రం కోసం ఉత్పత్తి, సరఫరా, వాడకం మధ్య ఉన్న చైన్ తెంచడం ద్వారా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

ఇకపై పరిస్థితి మారాలి.. 

వచ్చే నెలలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీలు చేద్దామని…ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గంజాయి విషయంలో ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరముంద‌ని సీఎం అన్నారు. నేరాల విచారణ విషయంలో అసలత్వాన్ని, ఆలస్యాన్ని సహించేది లేదని.. నేరం జరిగిన వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు ఎందుకు వెళ్లడం లేదని సీఎం ప్రశ్నించారు. ఇకపై ఈ పరిస్థితి మారాలన్నారు. నేరం జరిగిన చోట వేగంగా పోలీసులు స్పందించకపోతే…తానే స్వయంగా కొన్ని ఘటనలకు వెళ్లి విచారణను పర్యవేక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. సైబర్ క్రైంను ఎదుర్కోవడానికి నిపుణులతో చర్చించాలని… అవ‌స‌ర‌మైతే కొత్త చట్టాలు కూడా తీసుకొద్దామ‌ని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెట్టాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్ చార్జెస్ కింద కొంత మెత్తం విచారణ అధికారులకు ఇచ్చే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారని…. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్దరించాలని అధికారులు కోరగా దానికి సీఎం అంగీకరించారు. వీటితో పాటు గ్రేహౌండ్స్ సెంటర్, ఏపీ పోలీసు అకాడమీ, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంటర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు స్థితిగతులను అధికారులు వివరించారు. కేంద్రం నుంచి వీటికి రావాల్సిన నిధులు తెచ్చుకుని వెంటనే పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు అనే ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు. వాహనాల ఫిట్ నెస్ విషయంలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో వాహనదారులను వేధించినట్లు కాకుండా….ప్రజల రక్షణ కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అయ్యేవారిని వదిలిపెట్టవద్దని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా ఉండాలని సీఎం అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

విపత్తు నిర్వహణ సంస్థ కు తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన‌ 25 శాతం నిధులు ఇవ్వక పోగా.. కేంద్ర నుంచి వచ్చిన నిధులను డైవర్ట్ చేశారని అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఒక రకంగా నేరం అని ఆయన వ్యాఖ్యానించారు. భారీ వర్షాల సమయంలో పిడుగులు పడే సందర్భాల్లో ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. నాటి తెలుగు దేశం హయాంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో విపత్తులు వచ్చిన సమయంలో వెంటనే సంబంధిత శాఖలు సమన్వయంతో కేంద్రానికి నివేదికలు ఇవ్వాలని…తద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని ప్రజలకు సాయం చెయ్యవచ్చని సీఎం అన్నారు.