NTV Telugu Site icon

AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి సీఈవో నివేదిక

Cec

Cec

AP Violence: ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్‌ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్‌ను నియమించినట్లు సమాచారం. దీనిపై ఇవాళ రాత్రిలోపు అధికారిక ప్రకటన రానుంది. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో విచారణ మొదలు పెట్టినట్టు తెలిసింది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లోని ప్రతి ఘటన పైనా ఈసీకి సిట్‌ నివేదిక ఇవ్వనున్నంది. సిట్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

Read Also: Viral Video: ఒక్కసారిగా జలపాతంలో పెరిగిన వరద.. యువకుడు గల్లంతు

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. ఇప్పటికే ఏపీకి 20 కంపెనీల పారామిలటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను రెండెంచల నుంచి మూడెంచలకు పెంచారు. స్ట్రాంగ్ రూంల, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం ఏపీ సీఈఓ క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.