AP CEO MK Meena: పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని.. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని చెప్పారు. సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారని సీఈవో పేర్కొన్నారు. ఈనెల 20న కోర్టులో రెంటచింతల ఎస్ఐ మెమో దాఖలు చేశారని.. ఏ-1 నిందితుడిగా పిన్నెల్లిని ఎస్సై పేర్కొన్నారన్నారు. పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని.. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు.
Read Also: Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుకౌట్ నోటీసులు జారీ
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందన్నారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని సీఈవో వెల్లడించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించిందన్నారు. ఈవీఎం ధ్వంసంపై దర్యాప్తు జరుగుతోంది. ఇంతకుమించి మాట్లాడ లేనన్నారు. ఘటన తర్వాత ఈసీ ఆదేశాలతో అనేక బదిలీలు జరిగాయని.. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామన్నారు. వెబ్కాస్టింగ్ ఫుటేజ్ను పోలింగ్ మరుసటిరోజే పోలీసులకు అప్పగించామని.. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని.. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తారని భావిస్తున్నామన్నారు. సిట్ విచారణ కొనసాగుతోందని సీఈవో ఎంకే మీనా స్పష్టం చేశారు.