Site icon NTV Telugu

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్‌లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాన మంత్రి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక 16వ ఎస్ఐపిబి (SIPB) సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించి రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది. అమరావతిలో “క్వాంటమ్ వ్యాలీ” పరిధిలో మూడు సంస్థల స్థాపనకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఇది టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

విద్యా రంగంలో ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు ఆర్డినెన్స్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా, రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్రంగా చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పరిపాలనలో భాగంగా 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇకపై ఉద్యోగ నియామకాలు, బదిలీలు మల్టీ జోన్ మరియు జోనల్ విధానంలో అమలు చేసే దిశగా అడుగులు పడనున్నాయి.

ఇక, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. మరోవైపు, కూటమి ప్రభుత్వం త్వరలో రెండేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Exit mobile version