MLAs and MLCs Sports Event: ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలకు నిర్వహించనున్న ప్రత్యేక క్రీడా పోటీలను ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంతరం రాజకీయ ఒత్తిళ్లలో ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని పంచేలా ఈ క్రీడోత్సవం ఉండాలని, ఏర్పాట్లు పక్కాగా ఉండాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి ఆయన చర్చించారు.
Read Also: Mohsin Naqvi: “మేము భారత్తో ఆడటానికి కారణం ఆయనే”.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..
ఈ సమావేశంలో ప్రధానంగా క్రీడల ఎంపిక, విజేతలకు అందించే ట్రోఫీలు, మరియు వారికి అందించే ప్రత్యేక క్రీడా దుస్తుల (జెర్సీల)పై లోతుగా చర్చించారు స్పీకర్ అయ్యన్న. పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, క్రికెట్, టెన్నికాయిట్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, షాట్ పుట్, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్, పికిల్ బాల్ వంటి క్రీడలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపైనా దృష్టి సారించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు గణబాబు, కాల్వ శ్రీనివాస్, ఆదిరెడ్డి శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, సాప్ (SAP) చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. క్రీడల నిర్వహణ విజయవంతం చేయడానికి వారు పలు సూచనలు చేశారు.
