AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!

Ap Assembly

Ap Assembly

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు సభా కార్యక్రమాలు ప్రశ్నోత్తరాలతో మొదలుకానున్నాయి. అనంతరం పలు కీలక బిల్లులు, వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి. ఏపీ మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్‌-2026ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రులు శాసనసభ ముందుంచనున్నారు.

ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ 2024-25 వార్షిక నివేదికలను సభకు సమర్పించనున్నారు. ఇందులో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌ 6వ వార్షిక నివేదిక, ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 25వ వార్షిక నివేదిక, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 25వ వార్షిక నివేదికలు ఉన్నాయి. మాంసాభివృద్ధి సంస్థకు సంబంధించిన 2018-19, 2019-20, 2020-21 వార్షిక నివేదికలు కూడా సభ ముందుకు రానున్నాయి. ఈ నివేదికలను ఆలస్యంగా సమర్పించడానికి గల కారణాలను వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభకు వివరించనున్నారు. ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ వార్షిక నివేదికను కూడా శాసనసభ ముందుంచనున్నారు.

మెగా డీఎస్సీ-2025కు సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శాసనసభలో కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివరాలు వెల్లడిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. 2019 ఏపీ విద్యుత్‌ చట్టాల సవరణ బిల్లును ఉపసంహరించుకునే ప్రతిపాదనను విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఏపీ మున్సిపల్‌ చట్టాల మూడో సవరణ బిల్లు-2026 కూడా సభ ముందుకు రానుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడంతో పాటు, బిల్లును పరిశీలనకు తీసుకోవాలని మంత్రి నారాయణ ప్రతిపాదించనున్నారు. అనంతరం బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన చేయనుంది.

ఈ సమావేశాల్లో ఎల్‌నినో ప్రభావంపై స్వల్పకాలిక చర్చ కూడా జరగనుంది. ఎల్‌నినో కారణంగా సాగునీరు, వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ఎదురయ్యే ప్రభావం, భవిష్యత్‌లో తలెత్తే సవాళ్లపై సభ్యులు చర్చించనున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఉదయం 10:30 తర్వాత బ్రేక్‌ సమయంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన బీఏసీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి?, ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 8:40 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకుని సమావేశాలకు హాజరవుతారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల వరకు చీఫ్ జస్టిస్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు చీఫ్ జస్టిస్‌ క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరే సీఎం చంద్రబాబు, 7:35 గంటలకు విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు 7:35 నుంచి 7:45 గంటల వరకు హాజరవుతారు. రిసెప్షన్‌ నుంచి రాత్రి 7:45 గంటలకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.