AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్‌-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!

Cm Chandrababu Appsc Group 1 Scam

Cm Chandrababu Appsc Group 1 Scam

AP Assembly 2026 Four Day Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలపై బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ అధ్యక్షత బీఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు సహా పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు, జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలను మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. 20వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభా కార్యక్రమాల అజెండా, చర్చించాల్సిన అంశాలు, బిల్లులు, ఆర్డినెన్స్‌లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రేపు బీసీ రిజర్వేషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 9 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో సభ ముందుకు తీసుకురావాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు ఎల్లుండి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 వ్యవహారంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. సమయంతో సంబంధం లేకుండా సభలో చర్చించాల్సిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని బీఏసీలో నిర్ణయించినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 అక్రమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్‌-1 తరహా స్కామ్‌ను చూడలేదని అన్నారు. ఈ వ్యవహారంలో ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులు నష్టపోయారని సీఎం వ్యాఖ్యానించారు.

గ్రూప్‌-1 వ్యవహారంపై ఎల్లుండి అసెంబ్లీలో అన్ని విషయాలను చర్చిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, అభ్యర్థులకు జరిగిన నష్టంపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. డీఎస్సీ అంశంపైనా సీఎం స్పందించారు. డీఎస్సీలో మహిళా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారు నిన్న జరిగిన కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని చెప్పారు. ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే పెద్ద సంఖ్యలో మహిళా టీచర్లు రోడ్డుపైకి వచ్చారని సీఎం వ్యాఖ్యానించారు.

డీఎస్సీతో పాటు ఆ నియామక ప్రక్రియతో మహిళా ఉపాధ్యాయులకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడటాన్ని సహించలేకే వారు ఆందోళనకు దిగారని అన్నారు. మొత్తంగా బీఏసీ నిర్ణయాలతో రానున్న నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారాయి. బీసీ రిజర్వేషన్‌ నివేదిక, 9 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు, గ్రూప్‌-1 అక్రమాలు, డీఎస్సీ సహా పలు అంశాలపై సభలో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.