అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలను మార్చి 7 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే పొడిగించాలని కూడా నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని, రోజూ జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 14న అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మహా శివరాత్రి పర్వదినం తర్వాతి రోజున (ఫిబ్రవరి 16) సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు కీలక చర్చలు, బిల్లుల ఆమోదం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు, ఆర్థిక ప్రణాళికలపై ప్రతిపక్షం నుంచి తీవ్ర చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: AP Ministers: తస్మాత్ జాగ్రత్త అంటూ.. ఏపీలో కీలక మంత్రులకు హెచ్చరిక లేఖలు!
బడ్జెట్ సమావేశాల మధ్యలో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలకంగా మారనున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడం, కీలక చర్చలు జరగడం వంటి అంశాలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.
