హోం మంత్రి తానేటి వనితపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలన్నారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తూ ఉన్నారు.
రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలి. మీ చేతగానిపాలన అసమర్ధ పాలన వల్ల జరుగుతున్న ఘటనలు కూడా తల్లుల పెంపకం పైకి నెట్టే స్దాయికి దిగజారారు. తొమ్మిది నెలల పిల్లలు, మూడేళ్ళ పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతుంటే అది కూడా తల్లులు తప్పేనా..? ప్రభుత్వ బాధ్యత ఏమీ లేదా..? సీఎం ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన అత్యాచార ఘటనలపై కూడా స్పందించరా..?
విజయమ్మ గారి తప్పుడు పెంపకం వల్లే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారా? మహిళలపై వరుసగా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా జగన్ మూగ సీఎంలా మారారు. ఇష్టానుసారంగా తల్లుల పెంపకం మీద తల్లులమీద మాట్లాడితే తాటతీస్తాం. ఒక ఆడది అయ్యుండి మరో తల్లి గురించి నీచంగా మాట్లాడటం బాధాకరం. ఈ హోం మంత్రి కన్నా గతంలో పనిచేసిన హోంమంత్రి బెటర్ అనిపిస్తుంది. కనీసం రాసిచ్చిన స్క్రిప్ట్ అయినా చదివే వారన్నారు అనిత.
హోంమంత్రి ఏమన్నారంటే..
విశాఖలో హోం శాఖ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆడవాళ్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు వంటివి జరగకుండా తల్లులే జాగ్రత్త తీసుకోవాలన్నారు. మొదట బిడ్డల బాధ్యత తల్లులు దే, తరువాతే పోలీస్ లది అంటూ వ్యాఖ్యలు చేశారు. తల్లి పిల్లలు పెరిగే వాతావరణం కూడా చూసుకోవాలి. ఆడ బిడ్డల సంరక్షణ తండ్రి మీద కంటే తల్లి మీదే ఎక్కువగా ఉంటుంది.
పనులకు వెళ్ళినపుడు బిడ్డలను 24 గంటలు కాపాడుకోలేమని కొంతమంది తల్లులు అంటున్నారు. తల్లి పాత్ర సక్రమంగా పోషించకుండా పోలీసుల మీద, ప్రభుత్వం మీద వేయడం సరైన పద్ధతి కాదన్నారు అనిత. హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలను తప్పు బడుతున్నాయి ప్రతిపక్షాలు.
