CM YS Jagan: గృహనిర్మాణాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం ప్రగతిపై వివరాలు అందించారు. ఇప్పటి వరకు 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. రూఫ్ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.. ఈ అర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు అధికారులు. అయితే, కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు సీఎం జగన్.. ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన.. కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించడానికి ∙చర్యలు వేగవంతం చేయాలన్న సీఎం. డిసెంబర్లోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలని, ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలని ఆదేశించిన సీఎం. దీనిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఇక, సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం పనులు, దీనికి సంబంధించిన అంశాలను సీఎంకు తెలిపారు అధికారులు.. 45,101 మంది ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు.. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక కూడా పూర్తయిందని.. అందరితోనూ బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నీటి సరఫరా, అప్రోచ్ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులపై దృష్టిపెట్టామని తెలిపారు. ఇదే సమయంలో సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు, కోర్టు విచారణలో అంశాన్ని ప్రస్తావించారు అధికారులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్.. పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆయన.. పేదవాళ్ల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన అని దుయ్యబట్టారు. గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి.. దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.
మరోవైపు టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.. ఇప్పటివరకూ 71,452 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది ప్రభుత్వం. ఈనెలలో మరో 29,496 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు సిద్ధం అయ్యింది. ఆగస్టులో 49,604 ఇళ్లు ఇస్తామన్న అధికారులు. 300 చదరపు అడుగులు ప్లాట్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2వేల కోట్లు రుణాలుగా ఇప్పించామని తెలిపారు.. అయితే, టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని సీఎం ఆదేశించారు.. దీనికి సంబంధించి వివిధ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. వందల, వేల సంఖ్యలో గృహాలు ఈ కాలనీల్లో ఉంటున్నందున వారి అవసరాలను తీర్చేలా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.