Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్పై గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వేధింపుల పర్వంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకర పోస్టులు పెడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. కడప జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి అనసూయను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కేవలం తన సోషల్ మీడియా ఖాతాలకు వ్యూస్, ఫాలోయింగ్ పెంచుకోవాలనే దురాలోచనతో అనసూయకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడం లేదా అసభ్యకరమైన రీతిలో ఎడిట్ చేయడం వంటి పనులు చేశాడు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతూ వికృతానందం పొందేవాడు.
READ ALSO: AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు.. మరో పథకం అందుబాటులోకి..
తనపై జరుగుతున్న ఈ డిజిటల్ దాడిని తీవ్రంగా పరిగణించిన అనసూయ, గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు జనార్దన్ను గుర్తించారు. కడపలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తనే ఆ పోస్టులు పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కేవలం ఆన్లైన్ రీచ్ కోసమే సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం జనార్దన్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
