Man Loses Life After Trying to Calm RS 20 Dispute in Anantapur: కేవలం రూ.20 కోసం ప్రారంభమైన చిన్న గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవను ఆపేందుకు, ఇరువురిని సర్దిచెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని మామా-అల్లుడు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందు నాయక్, గోపి నాయక్ అనే మామా-అల్లుళ్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లారు. అక్కడ కూరగాయల వ్యాపారితో రూ.20 విషయంలో వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అక్కడే టీ స్టాల్ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఈ ఘర్షణను గమనించి వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. ఇరువర్గాలకు సర్ది చెప్పి వివాదాన్ని ముగించాలని సూచించాడు. అయితే మద్యం మత్తులో ఉన్న గోవిందు నాయక్, గోపి నాయక్ ఆగ్రహంతో చంద్రశేఖర్పైనే దాడికి దిగారు.
గోవిందు, గోపి కలిసి చంద్రశేఖర్ ఛాతిపై పలుమార్లు బలంగా పిడిగుద్దులు గుద్దడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే కుప్పకూలిన చంద్రశేఖర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులైన గోవిందు, గోపి నాయక్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేవలం రూ.20 వివాదం చివరకు ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

