Empty Water Bottle saved 2 Months old Baby: అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్) జరిగిన హృదయ విదారక ఘటన తీవ్ర కలకలం రేపింది. చికిత్స పొందుతున్న 58 రోజుల పసికందును నానమ్మ ఆసుపత్రి భవనం పై అంతస్తు నుంచి కింద ఉన్న కాలువలో పడేసింది. అదృష్టవశాత్తూ కాలువలో ఉన్న ఖాళీ వాటర్ బాటిళ్లపై శిశువు పడటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జీజీహెచ్ వైద్యులు వెల్లడించారు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ పరిధిలోని మావిడాకులపల్లికి చెందిన పూజిత, అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 58 రోజుల ఆడశిశువు ఉంది. పాపకు ఫిట్స్ రావడంతో ఈ నెల 22న మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకువచ్చారు. వైద్యులు పీడియాట్రిక్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి శిశువు నానమ్మ సత్యమ్మ పాపను ఎత్తుకుని వార్డు నుంచి బయటకు తీసుకెళ్లింది. కొంతసేపటి తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో ఆసుపత్రిలో ఆందోళన నెలకొంది.
చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారని సమాచారం రావడంతో వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. పాపను నానమ్మే తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో పసికందు ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో సిబ్బంది గాలింపు చేపట్టారు. ఓపీ గది సమీపంలోని కాలువలో శిశువు పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే బయటకు తీసి వైద్య చికిత్స అందించారు. పై అంతస్తు నుంచి విసిరేసిన సమయంలో కాలువలో ఉన్న ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై పడటంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆ దేవుడే కాపాడంటూ తల్లి పూజిత ఆనందం వ్యక్తి చేసింది.
ఈ ఘటనపై అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువు తండ్రి అశోక్ కుమార్తో పాటు నానమ్మ సత్యమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పసికందును ఎందుకు కాలువలో పడేశారనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆడశిశువు కావడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేదా మరే ఇతర కుటుంబ పరిస్థితులు కారణమా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

