Site icon NTV Telugu

Lok Sabha Elections 2024: నేడు తెలంగాణలో 3 చోట్ల అమిత్ షా, 2 చోట్ల రాహుల్ గాంధీ సభలు..

Amit Sha

Amit Sha

Telangana: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇక, కాగజ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో బీజేపీ పార్టీ అభ్యర్థుల తరఫున అమిత్ షా ప్రచారం చేయనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో మాట్లాడనున్నారు. అయితే, నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీలోని శ్రీసత్యసాయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ లోని ఎస్‌పీఎం క్రికెట్‌ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.

Read Also: Delhi: కిరాణా షాపులో ఇద్దరు పిల్లల హత్య.. తండ్రి పరార్

ఇక, సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ అమిత్ షా చేరుకోనున్నారు. సాయంత్రం 5:10 గంటల నుంచి 5:50 గంటల వరకు అక్కడి గిరిరాజ్‌ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 7:30 గంటల దాకా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అలాగే, రాత్రి 7:55 నిమిషాలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు అమిత్ షా బయలుదేరి వెళ్లనున్నారు.

Read Also: Wolf Man: ప్రపంచంలోని అత్యంత వెంట్రుకల కుటుంబం.. ఎక్కడో తెలుసా..

అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు (ఆదివారం) తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాందేడ్‌ నుంచి నేరుగా నిర్మల్‌కు రానున్నారు.. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అలంపూర్‌ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అలంపూర్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకొని పార్టీ నేతలతో కాసేపు ప్రత్యేకంగా సమావేశం కావాలి. ఆ తర్వాత తిరిగి ఆయన ఢిల్లీ వెళ్తారని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపాయి.

Exit mobile version