ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం. 900 కేజీల బరువుండే 1,800 బాంబులు, 226 కేజీల బరువుండే 1,1700 బాంబులు టెల్ అవీవ్ కు అందవు. ఈ అంశాన్ని బైడెన్ కార్యవర్గంలోని కీలక అధికారి పేర్కొన్నారు. రఫాలో పౌరులు భద్రత, వానికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళన చెందిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనను ఇజ్రాయెల్ పట్టించుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ దాడిపై అమెరికా మొదటి నుంచి అసంతృప్తి గా ఉంది.
READ MORE: DC vs RR: ఐపీఎల్ మ్యాచ్లో రాజకీయ నినాదాలు.. 6 మంది అరెస్ట్!
జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాము సరఫరా చేస్తున్న ఆయుధాలను ఉపయోగిస్తారనే ఆందోళనలు అగ్రరాజ్యంలో ఉన్నాయి. ప్రస్తుతం రఫాలో దాదాపు 10 లక్షల మందికిపైగా తలదాచుకొంటున్నారు. ‘‘రఫాలో భారీ ఆపరేషన్లు చేపట్టకూడదని. ఆ ప్రాంతంలోకి మానవీయ సాయం పంపించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు వీలుగా చర్చలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రఫాలో వాడుతుందని అనుమానిస్తున్న ఆయుధాల ఎగుమతిని పునఃసమీక్షిస్తున్నాం’’ అని అమెరికా వర్గాలు వెల్లడించాయి. పరిణామాలపై ఇజ్రాయెల్ స్పందించనందున ఈ నిర్ణయం తీసుకుంది.
హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఐడీఎఫ్ యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్ను ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలిపినట్లు ఈజిప్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై.. రఫాపై మిలిటరీ ఆపరేషన్కు పచ్చజెండా ఊపింది. అగ్రరాజ్యం చెప్పిన మాటలను పెడచెవిన పెట్టినందుకు ఇప్పడు ఇజ్రాయెల్ కు పెద్ద చిక్కెదురైంది.