వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో మరోసారి ఊరట లభించింది. సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను గుంటూరు జిల్లా కోర్టు బుధవారం తిరస్కరించింది. అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే అంబటి రాంబాబుపై నమోదైన మరో రెండు కేసుల్లో కూడా బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. తాజాగా వచ్చిన బెయిల్ ఆర్డర్తో విడుదల కానున్నారు. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు అందగానే.. అధికారిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ కానున్నారు. అంబటిపై నమోదైన కేసుల్లో ఒకటి సీఎం నారా చంద్రబాబు నాయుడుపై దూషణల ఆరోపణలకు సంబంధించినది కాగా.. మరొకటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలకు సంబంధించినది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన కీలక నేత అయిన అంబటి రాంబాబు వరుస కేసుల్లో బెయిల్ పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనపై నమోదైన ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగా.. బెయిల్ మంజూరు కావడం ఆయనకు తాత్కాలిక ఊరటనిచ్చింది.