Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!

Ambati

Ambati

గుంటూరులో మెగా డీఎస్సీ నియామకాలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ గుంటూరు జాయింట్ కలెక్టర్‌కు వైసీపీ నేతలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కుట్రపూరిత ప్రణాళికతో వ్యవహరించిందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘మెగా డీఎస్సీలో మొత్తం 441 పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలోని కొన్ని పోస్టులను అక్రమంగా కేటాయించారు. మరికొన్ని పోస్టులు డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అనుకూలంగా ఉండే అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకే స్పోర్ట్స్ కోటా నిబంధనలను మార్చారు. పరీక్ష నిర్వహణకు ముందు అమల్లో ఉన్న జీవోను రద్దు చేసి.. కొత్త జీవో తీసుకొచ్చారు. నియామకాలు పూర్తైన తర్వాత మళ్లీ పాత జీవోను పునరుద్ధరించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

‘స్పోర్ట్స్ కోటా విషయంలో సాధారణంగా 2 శాతం రిజర్వేషన్ ఉండాల్సి ఉండగా.. దానిని 3 శాతానికి పెంచారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని జీవోలో మార్పులు చేశారు. ఈ మార్పుల వల్ల కొందరికి అన్యాయం జరిగింది. నవీన్ అనే అభ్యర్థికి ఉద్యోగం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. చర్చల పేరుతో అసలు సమస్యను ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. పరీక్షకు ముందు, తర్వాత జీవోలను మార్చడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలి’ అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేసిన అంబటి రాంబాబు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నిరుద్యోగులకు తగిన ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కూడా అమలు చేయలేదని విమర్శిస్తూ.. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నిజాలు వెలుగులోకి తీసుకురావాలని అంబటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.