NTV Telugu Site icon

Amaravati Relaunch: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.. త్వరలో బీసీలకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న కృష్ణయ్య!

Pm Modi

Pm Modi

విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పాలాభిషేకం చేశారు. బీసీల పట్ల మోడీకి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి వల్లే కులగణన సాధ్యమైందన్నారు. కులాల లెక్కలు తీయడం ద్వారా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లభించనున్నాయని పేర్కొన్నారు. ఇది బీసీల విజయం మాత్రమే కాదు.. దేశంలో ఓ కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. జనగణనలో కుల గణన చేయడానికి స్వాతంత్య్రం ఉన్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదని విమర్శించారు. అనేక కమిషన్లకు లెక్కలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోలేదని తెలిపారు. మోడీ ఓబీసీల పట్ల నిజమైన కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు అని ప్రశంసించారు. త్వరలోనే బీసీలకు కేంద్ర మంత్రి పదవి లభించనుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై చిత్తశుద్ధితో వ్యవహరించలేదని కృష్ణయ్య ఆరోపించారు.

Also Read: Amaravati Sabha: సైకిల్ యాత్రగా అమరావతి సభా ప్రాంగణానికి ఎంపీ కలిశెట్టి!

ఇక ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనను చారిత్రక ఘట్టం అన్నారు ఆర్‌. కృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు రాజధాని విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ, ఇప్పుడు అమరావతి అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు, అమరావతిని అదే విధంగా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు కృష్ణయ్య. బీసీలు భారత మాత ముద్దు బిడ్డలు.. ఇది బీసీల మొదటి విజయం కాదు దేశంలో ఓ కొత్త శకం ప్రారంభమైందన్నారు. కొన్ని పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరుసగా ఎన్నికల్లో మోడీ గెలుస్తున్నారు, మోడీ ఓబీసీల పట్ల నిజమైన కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు, మోడీ నాయకత్వంలో బీసీలకు మంచి జరిగింది, త్వరలో బీసీలకు కేంద్ర మంత్రిపదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కృష్ణయ్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదు, లెక్కలు తీసుకుంది, కులగణనపై కాంగ్రెస్‌కు నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య.