ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ఢిల్లీలో పర్యటిస్తున్నారు. భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ భద్రతా అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, సముద్ర భద్రత, నావిగేషన్ స్వేచ్ఛ, అలాగే ఇంధన, వాణిజ్య రవాణా మార్గాల రక్షణపై కూడా ఇద్దరు ప్రతినిధులు అభిప్రాయాలు పంచుకున్నారు.
రక్షణ పరిశ్రమలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా శిక్షణ, ఆపరేషన్లు, సంయుక్త వ్యాయామాల వంటి అన్ని రంగాల్లో రక్షణ, భద్రతా సహకారాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ భేటీ భారత్-ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
