భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన సెలక్టర్ పదవిలో అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి ఇష్టపడటం లేదు. అక్టోబర్ 4తో ముగియనున్న తన ప్రస్తుత కాంట్రాక్ట్ను ముందుకు తీసుకెళ్లబోనని ఆయన ఈ వారంలోనే బీసీసీఐకి స్పష్టం చేశారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఈ బాధ్యతల్లో కొనసాగాలా వద్దా అని ఆయన గతంలో బోర్డును సంప్రదించినప్పటికీ, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నిన్న ముంబైలో జరిగిన బీసీసీఐ సమీక్షా సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. అగార్కర్ హయాంలో భారత జట్టు పలు అద్భుత విజయాలను నమోదు చేసింది. జూలై 2023లో ముఖ్య సెలక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ 2024, 2026 సంవత్సరాల్లో రెండు వరుస టి20 ప్రపంచకప్లను కైవసం చేసుకుంది. అలాగే 2023, 2025లో రెండు ఆసియా కప్లతో పాటు గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.
అయితే ఇదే కాలంలో స్వదేశంలో కొన్ని నిరాశపరిచే ఫలితాలను కూడా ఎదుర్కొంది. 2024లో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో, 2025లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్లను కోల్పోయింది. అలాగే రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్ పూర్తిస్థాయి వన్డే, టెస్ట్ కెప్టెన్గా, టీ20ల్లో సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను నియమించడంలో అగార్కర్ కీలక పాత్ర పోషించారు.
2027 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో అగార్కర్ వైదొలగడం బోర్డుకు సవాలుగా మారనుంది. ఈ వారంలో వెస్టిండీస్తో జరిగే వైట్-బాల్ సిరీస్ కోసం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి అగార్కరే అధ్యక్షత వహించారు. అయితే అక్టోబర్ మధ్యలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుండటంతో, ఆ లోపు బీసీసీఐ కొత్త ప్రధాన సెలక్టర్ను నియమించాల్సిన బాధ్యత ఏర్పడింది. అగార్కర్ భవితవ్యంపై త్వరలోనే స్పష్టత వస్తుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

