Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..

Air India

Air India

Air India: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర భయాందోళనకర పరిస్థితి ఎదురైంది. ప్రయాణంలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్రమైన ‘టర్బులెన్స్’ (గాల్లో ఒత్తిడి మార్పుల వల్ల వచ్చే తీవ్రమైన కుదుపులు)కు గురైంది. ఈ ప్రక్రియలో విమానం హఠాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోవడంతో ప్రయాణికులు, కేబిన్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ అనుకోని సంఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ క్రూ సిబ్బంది గాయపడ్డారు.

అసలేం జరిగింది?

ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న AI2379 విమానం (VT-EXO) గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా తీవ్రమైన టర్బులెన్స్‌కు లేదా అప్‌డ్రాఫ్ట్-డౌన్‌డ్రాఫ్ట్‌కి లోనైంది. దీని ప్రభావంతో విమానం ఎత్తులో అకస్మాత్తుగా మార్పు వచ్చి, ఏకంగా 300 అడుగులు కిందకు జారిపోయింది. ఈ సమయంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో విమానంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురై, నియంత్రణ కోల్పోయి పడిపోయారు. అయితే, పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పి, సురక్షితంగా ఢిల్లీ వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర సహాయం

ఈ ఘటన గురించి సమాచారం అందగానే ఢిల్లీ విమానాశ్రయ అధికారులను ముందే అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికే మెడికల్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు. విమానం సురక్షితంగా రన్ వే పై దిగగానే వైద్య బృందాలు ప్రయాణికులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన ప్రథమ చికిత్సను అందించాయి. బాధితులకు వచ్చినవి స్వల్ప గాయాలేనని ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

ఎయిర్ ఇండియా స్పందన, విచారణ

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారికంగా స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. టర్బులెన్స్ కారణంగా విమానం ఎత్తులో తాత్కాలిక మార్పు వచ్చిందని, కొంతమందికి స్వల్ప గాయాలైనప్పటికీ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుందని తెలిపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, టర్బులెన్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో విశ్లేషిస్తామని పేర్కొంది.

అసలు ‘టర్బులెన్స్’ అంటే ఏంటి?

విమాన ప్రయాణ సమయంలో గాలి ఒత్తిడి, వేగంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల ‘టర్బులెన్స్’ ఏర్పడుతుంది. దీనివల్ల విమానం బలంగా ఊగడం లేదా ఎత్తులో తీవ్రమైన మార్పులు రావడం జరుగుతుంది. ఇలాంటి ఊహించని పరిస్థితుల నుంచి రక్షణ పొందేందుకు ప్రయాణికులు విమానంలో ఉన్నంతసేపు సీట్ బెల్ట్ ధరించడమే అత్యంత సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.