Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్‌ రిలీఫ్.. ఏం జరిగిందంటే?

Tvk Cabinet

Tvk Cabinet

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి, నటుడు సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 21 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఈపీఎస్ క్యాంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ మంగళవారం తిరస్కరించారు. మే 13న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ ఆదేశాలను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎమ్మెల్యేలకు స్పీకర్ నిర్ణయంతో పెద్ద ఉపశమనం లభించింది.

ఈ రాజకీయ సంక్షోభం వెనుక పెద్ద కథే నడిచింది. ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 47 స్థానాలు గెలుచుకున్న ఏఐఏడీఎంకేలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. ఎన్నికల్లో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ మార్కును అందుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, లెఫ్ట్ పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మే 13 నాటి విశ్వాస పరీక్ష సమయంలో ఏఐఏడీఎంకే సీనియర్ నేతలు షణ్ముగం, ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని ఒక పెద్ద తిరుగుబాటు వర్గం విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది. దీంతో అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలం 119 నుంచి ఒక్కసారిగా 144 కి చేరి, ఆయనకు తిరుగులేని మెజార్టీ లభించింది.

×
×
Ad

మరోవైపు, ఎడప్పాడి పళనిస్వామికి విధేయులుగా ఉన్న మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పార్టీలో చీలిక బహిర్గతమైంది. ఈ పరిణామం పళనిస్వామి పట్టును పూర్తిగా బలహీనపరిచింది. అయితే, ఆ తర్వాత తిరుగుబాటు వర్గంలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి తమ పాత బాస్ ఈపీఎస్ క్యాంపునకు వచ్చేయడంతో ప్రస్తుతం పళనిస్వామి వెనుక ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 27 కి పెరిగింది. ఇక్కడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పెద్ద అడ్డంకిగా మారింది. చట్టం ప్రకారం ఒక పార్టీ ఎమ్మెల్యేల గ్రూప్ అధికారికంగా వేరే పార్టీలో విలీనం అవ్వాలంటే లేదా చీలికగా గుర్తింపు పొందాలంటే సదరు శాసనసభ పక్షంలో కనీసం మూడింట రెండు వంతుల (2/3) మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఏఐఏడీఎంకే విషయంలో ఆ సంఖ్య 31 గా ఉంది. కానీ తిరుగుబాటు వర్గం వద్ద కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో వారు అధికారికంగా విలీనం కాలేకపోయారు. ఈ లోపే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు స్పీకర్‌కు ఫిర్యాదులు చేసుకున్నాయి. కాగా, ఈ 25 మందిలో నలుగురు ఎమ్మెల్యేలు కొద్దిరోజుల క్రితమే అధికారికంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరిపోవడం గమనార్హం.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ తిరుగుబాటును నడిపిస్తున్న సీనియర్ నేత ఎస్.పి. వేలుమణి ఆ తర్వాత ఈ ఆందోళనలను చల్లబరిచే ప్రయత్నం చేశారు. తమకు లేదా షణ్ముగానికి పార్టీని చీల్చే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తాము ఇప్పటికీ ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామికే విధేయులమని, దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత అందించిన ‘అమ్మ పాలన’ వారసత్వాన్ని పునరుద్ధరించడమే తమ ఏకైక లక్ష్యమని వేలుమణి పునరుద్ఘాటించారు. అంతేకాదు, తాము విజయ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవులను ఆశించలేదని, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం తిరుగుబాటు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలకు ఎలాంటి క్యాబినెట్ బెర్తులు కేటాయించలేదని ఆయన గుర్తుచేశారు.