AIADMK MLAs Support Vijay: తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి అన్నాడీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు సంకేతంగా మారింది. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఈ అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించింది. బుధవారం అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల సహకారంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు షణ్ముగం నేతృత్వంలోని 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం తోడవడంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతంగా తయారైంది.
తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో షణ్ముగం మాట్లాడుతూ.. ప్రజలు విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, ఆ ప్రజా తీర్పును గౌరవిస్తూనే తాము టీవీకే ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) తీరుపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని ఎన్నికలుగా అన్నాడీఎంకే వరుస ఓటములను చవిచూస్తోందని గుర్తు చేశారు. 2019 లోక్సభలో ఒక సీటు, 2021 అసెంబ్లీలో 75 సీట్లు, 2024 పార్లమెంటు ఎన్నికల్లో సున్నా.. ఇలా వరుసగా పార్టీ పతనం అవుతోందని, తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 47 స్థానాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకేను కాపాడుకోవడమే తన లక్ష్యమని, పార్టీని చీల్చే ఉద్దేశం లేదని షణ్ముగం స్పష్టం చేశారు. అయితే, టీవీకే కూటమిని ఎదుర్కొనేందుకు డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలన్న ఈపీఎస్ ప్రతిపాదనను మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని వెల్లడించారు. డీఎంకే వంటి ‘దుష్ట శక్తి’ని అంతం చేయడానికే ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్లే తాము ఈపీఎస్ ప్రతిపాదనను తిరస్కరించి, విజయ్కు మద్దతు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఈపీఎస్ వెనుక కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా, 30 మంది షణ్ముగం వైపు చేరారు. షణ్ముగం బృందం ఎస్.పి. వేలుమణిని శాసనసభాపక్ష నేతగా, జి. హరిని ఉపనేతగా ఎన్నుకుంది. అలాగే, ప్రస్తుతం తమ పార్టీకి బీజేపీతో సైతం ఎటువంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వరుస ఓటములపై చర్చించేందుకు జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈపీఎస్ను కోరినట్లు షణ్ముగం తెలిపారు. జయలలిత మరణం తర్వాత ఉనికి కోసం పోరాడుతున్న అన్నాడీఎంకేకు ఈ పరిణామం కోలుకోలేని దెబ్బగానే కనిపిస్తోంది.
