TDP and Janasena: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారంతో ఒక్కసారిగా కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తుల పర్వం తారాస్థాయికి చేరుకుంది. పొత్తులతో ఆశలు గల్లంతుకావడంతో నేతలంతా రోడెక్కుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. నియోజకవర్గ ఇంఛార్జి తిక్కారెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిరసనలు, ధర్నాలతో హోరెత్తించారు కార్యకర్తలు. రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు చేపట్టారు. రహదారులపై టైర్లు దగ్ధం చేసి ఆందోళన చేశారు.
బెజవాడలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మైలవరం, బెజవాడ వెస్ట్ సీట్ల విషయంలో రగడ కొనసాగుతోంది. రోడ్డెక్కి ఆందోళనకు దిగారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. మైలవరం టీడీపీ సీటు బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వాలని గొల్లపూడి సెంటర్లో క్యాడర్ ఆందోళన చేపట్టారు. బెజవాడ పశ్చిమ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం వుండటంతో, జనసేన నేత పోతిన మహేష్ అనుచరులు రాస్తా రోకో నిర్వహించారు. ఇరు పార్టీల కార్యకర్తల ఆందోళనలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. పిఠాపురంలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. పిఠాపురం జనసేన అధినేత పవన్ కు కేటాయించడంతో, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ ఆందోళనకు దిగారు. ఆయన వర్గీయులు రెండ్రోజులుగా నిరసన ప్రదర్శనలు చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు శనివారం ఆయన్ని కలుస్తున్నానని చెప్పారు పిఠాపురం వర్మ. కార్యకర్తలు సలహాలు, సూచనల మేరకు భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానన్నారు.
అమరావతిలోని చంద్రబాబు నివాసానికి అసంతృప్త నేతలు క్యూ కడుతున్నారు. మాజీ మంత్రి జవహర్ చంద్రబాబుతో మాట్లాడారు. అయితే జవహర్కు ఇప్పటివరకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. రంపచోడవరంలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన వంతల రాజేశ్వరి అమరావతిలో ధర్నాకు దిగారు. చంద్రబాబు ఇంటి దగ్గర రాజేశ్వరితో పాటు రంపచోడవరం నుంచి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంగన్వాడీ కార్యకర్త మిరియాల శిరీషకు టీడీపీ టికెట్ కేటాయించడంపై వంతల రాజేశ్వరి అనుచరులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. వంతల రాజేశ్వరి వర్గంతో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు..పార్టీ పెద్దలతో మాట్లాడారు.
సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి ఇంటి దగ్గర ధర్మవరం టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయిస్తారంటూ ప్రచారం జరగడంతో పరిటాల శ్రీరామ్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్కే కేటాయించాలని నిరసన చేపట్టారు ధర్మవరం టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పరిటాల శ్రీరామ్ వర్గీయులను బీకే పార్థసారథి సముదాయించారు. అనకాపల్లి జిల్లా జనసేనలో టికెట్ల కేటాయింపుల వ్యవహారం చిచ్చుపెట్టింది. ఆ పార్టీకి రాజీనామా చేశారు నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు. 14 రోజులుగా పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ప్రయత్నించినా…అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కొణతాల రామకృష్ణకు సీటు ఇచ్చే మందు ఒక్క మాట కూడా తనతో చెప్పలేదన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత మరో నాయకుడు జనసేనలో లేరని తెలిపారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనలా చాలా మంది జనసేన నియోజకవర్గ ఇంఛార్జులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.