AE Nukaraju Family Suicide Case Update: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ గొల్లపూడి నూకరాజు కుటుంబ సమేతంగా గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. కుటుంబం ఆత్మహత్యకు కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు షేక్ షాదిక్ వేధింపులే కారణమని నూకరాజు సూసైడ్ నోట్ ద్వారా నిర్ధారణ అయింది. సూసైడ్ నోట్ ఆధారంగా కాకినాడ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి షేక్ షాదిక్ను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్ రెడ్డి మృతిపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత నెల రెండో తేదీన జగదీశ్ రెడ్డి మృతి చెందగా.. ఆయన మరణానికి కూడా షాదిక్ కారణమని పోలీసులు కనుగొన్నారు. విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన కారణంగానే జగదీశ్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. గోదావరిలోకి దూకిన ఘటనలో నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు అందించిన సమాచారం, ఏఈ నూకరాజు సూసైడ్ నోట్ను దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ పోలీసులు సమన్వయంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు జగదీశ్ రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి మరణానికి అసలు కారణం తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలేనని జగదీశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. గతంలో తన కుమారుడు వైరస్ కారణంగా మృతి చెందినట్లు చెప్పారని, ఇప్పుడు హత్య జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన వాపోయారు. తన కుమారుడిని హత్య చేసిన షేక్ షాదిక్ను నడిరోడ్డుపై ఉరితీయాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

