NTV Telugu Site icon

Janhvi Kapoor: పక్షవాతానికి గురయ్యానా అనిపించింది.. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయి: జాన్వీ

Janhvi Kapoor Hospitalised

Janhvi Kapoor Hospitalised

Janhvi Kapoor talks about Hospitalisation: బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ కపూర్‌ ఇటీవల ఫుడ్‌ పాయిజన్‌కు గురైన విషయం తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకొని.. చికిత్స తీసుకొని కోలుకున్నారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా జాన్వీ ఆస్పత్రి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయని చెప్పారు. ఈ సంఘటన తర్వాత పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ… ‘ఇటీవల రోజుల్లో షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉన్నాను. విరామం లేకుండా ప్రయాణాలు చేసి షూటింగ్‌లలో పాల్గొన్నాను. దీంతో చాలా వీక్‌ అయ్యాను. ఓ సాంగ్ షూటింగ్‌ కోసం చెన్నై వెళ్లా. అక్కడ బయట ఫుడ్ తిన్నాను. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత చాలా నీరసంగా మారింది. తలనొప్పి, వణుకు వచ్చాయి. చాలా టెన్షన్‌ పడ్డాను. హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్‌ ఎక్కేముందు పక్షవాతానికి గురయ్యానా? అనే భావన కలిగింది. సాయం లేకుండా వాష్‌ రూమ్‌కు కూడా వెళ్లలేకపోయాను. నడవడానికి కూడా ఓపిక లేదు’ అని తెలిపారు.

Also Read: Malavika Mohanan: అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ చెప్పలేదు.. తప్పక చేయాల్సి వచ్చింది!

‘మూడు రోజులు హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నాను. చాలా భయంగా గడిపా. అప్పుడే పని కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఆసుపత్రిలో ఉన్న ఆ మూడు రోజులు మళ్లీ డ్యాన్స్‌ చేయగలనో లేదో అని భయపడ్డా. ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా లేను. ఇప్పుడిప్పుడే వర్క్‌లో బిజీ అవుతున్నాను’ అని జాన్వీ కపూర్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జాన్వీ ఉలఝ్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తెలుగులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.