శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బూరగాం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ మగ శిశువును కన్నవారే నిర్దాక్షిణ్యంగా ముల్లపొదల్లో వదిలేసి వెళ్లారు. ఆ అమాయక పసిబిడ్డ ఏడుపు గ్రామాన్ని కదిలించింది. ఒక అపరిచిత మహిళ చూపిన మానవత్వంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
బూరగాం గ్రామానికి చెందిన ఓ మహిళకు ముల్లపొదల వైపు నుంచి శిశువు ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా.. చీమలు కుడుతున్న పరిస్థితిలో, ఇంకా పుట్టిన వేడి కూడా తగ్గని పసికందు కనిపించాడు. ఆ దృశ్యం చూసి చలించిపోయిన ఆమె వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించింది. గ్రామస్థులు వెంటనే శిశువును సమీపంలోని క్లినిక్కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆ పసికందు ఆరోగ్యం కుదురుకుంది.
అనంతరం గ్రామానికి చెందిన దేవకి కుటుంబం ఆ శిశువును చూసుకునేందుకు ముందుకొచ్చింది. కన్నవారు భారంగా భావించి వదిలేసిన ఆ పసికందుకు.. ఒక అపరిచిత మహిళ చూపిన మానవత్వం, దేవకి కుటుంబం తీసుకున్న నిర్ణయం పునర్జన్మనిచ్చినట్లయ్యింది. దేవకి కుటుంబంను అందరూ ప్రశంసిస్తున్నారు. మనుషుల్లో మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.