Aarohi Tomar: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న నేటి తరం అమ్మాయిలు కేవలం కలలు కనడమే కాదు, ఆ కలలను నిజం చేసేందుకు రంగంలోకి దూకుతున్నారు. కళ్లలో గెలవాలన్న కసి.. గుండె నిండా దేశం కోసం పతకం సాధించాలన్న తపనతో ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్ జిల్లాకు చెందిన ఆరోహి తోమర్ రెజ్లింగ్ రింగ్లో రికార్డులు సృష్టిస్తోంది. 7వ తరగతి చదువుతున్న ఆరోహి తోమర్ ఇప్పటివరకు రెండు రాష్ట్ర స్థాయి బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. గత 3-4 ఏళ్లుగా నిరంతరం సాధన చేస్తున్న ఈ బాలిక, ఇప్పటి వరకు సుమారు 30కి పైగా పోటీల్లో పాల్గొని, అందులో 20 సార్లు విజేతగా నిలిచింది.
తండ్రి కల.. కుమార్తెల లక్ష్యం..
ఆరోహి తండ్రి గజేంద్ర సింగ్ తోమర్ స్వయంగా రెజ్లర్. దేశం కోసం గోల్డ్ మెడల్ గెలవాలన్నది ఆయన కల, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు తన ఇద్దరు కుమార్తెలను గొప్ప క్రీడాకారిణులుగా తీర్చిదిద్ది తన కలను నెరవేర్చుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఆరోహికి తన తండ్రే స్వయంగా శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఆమె స్టేడియంలో కూడా ప్రాక్టీస్ చేస్తోంది. కేవలం ఆరోహినే కాకుండా, ఆమె అక్క కూడా ఇప్పటికే స్టేట్ లెవల్ గోల్డ్ మెడలిస్ట్ కావడం విశేషం. వారణాసిలో జరిగిన ఇటీవలి పోటీలో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఆరోహి నేషనల్స్కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ, ఆమె ఆత్మవిశ్వాసం తగ్గలేదు. “నా లక్ష్యం అంతా ఒలింపిక్స్లో దేశం కోసం బంగారు పతకం సాధించడమే” అని ఆరోహి ధీమాగా చెబుతోంది. “నా ఉద్యోగం లేదా ఇతర విషయాల కంటే నా కుమార్తెలు దేశం పేరు నిలబెట్టడమే నాకు ముఖ్యం. భవిష్యత్తులో వారు కచ్చితంగా అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున మెడల్స్ గెలుస్తారు” అని ఆరోహి తండ్రి గజేంద్ర సింగ్ తోమర్ ధీమా వ్యక్తం చేశారు.
READ ALSO: Ugadi Special: అరగంటలో ఉగాది ప్రసాదాలు.. హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
