AAP: ఢిల్లీలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం, కాక్రోచ్ జనతా పార్టీ(సీజీపీ) మద్దతుదారులు పార్లమెంట్ మార్చ్కు పిలుపునిచ్చారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో వందకు పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు ఉన్నారు.
మంగళవారం ఈ నిరసనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక, కేరళ సీఎంలు డీకే శివకుమార్, సతీషన్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించారు. సీజేపీ నిరసనను కాంగ్రెస్ బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. సీజేపీ నిరసనను బలహీనపరిచేందుకు, మోడీజీ రాహుల్ గాంధీని తన నివాసంలో నిరసనకు కూర్చోబెట్టారు అని ఆయన ఎక్స్లో రాశారు. ఇదే విషయంపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అతిషా సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది అద్భుతం! సీజేపీ, సోనమ్ వాంగ్చుక్ నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మోదీ ప్రభుత్వం వారితో చర్చలకు నిరాకరిస్తోంది. అదే సమయంలో, రాహుల్ గాంధీని ప్రధాని నివాసం బయట నిరసన తెలిపేందుకు అనుమతించారు. గంటలోపే మోదీ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. వావ్!’’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.

