Delhi Crime: పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీ విద్యార్థిని తలపై రాడ్డుతో కొట్టి..

Delhi Crime

Delhi Crime

Delhi Crime: దేశరాజధాని ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో దారుణం జరిగింది. ఓ కళాశాల విద్యార్థినిపై రాడ్డుతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాధితురాలు కమలా నెహ్రూ కాలేజీకి చెందిన విద్యార్థిని నర్గీస్‌ కాగా.. ఆమెపై నిందితుడు రాడ్డుతో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి పార్కుకు వచ్చింది. ఈ హత్యకు సంబంధించి ఆమె స్నేహితుడు 28 ఏళ్ల ఇర్ఫాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందని, దీంతో హత్యకు పాల్పడ్డానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఢిల్లీలోని అరబిందో కాలేజీ సమీపంలోని పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణ ప్రకారం, బాధితురాలి కుటుంబం వారి వివాహానికి నిరాకరించింది. నర్గీస్ ఇర్ఫాన్‌తో మాట్లాడటం మానేసింది. నర్గీస్ తనతో మాట్లాడటం మానేసిన తర్వాత అతను కలత చెందాడు. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన బాధితురాలు మాలవీయ నగర్‌లో కోచింగ్‌ తరగతులకు హాజరవుతోంది. ఈ నేపథ్యంలో మాట్లాడాలని పిలిచి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Assam CM: కాంగ్రెస్‌ లవ్‌ జిహాద్‌ వ్యాఖ్యలపై అసోం సీఎం ఫైర్‌

సమాచారం అందుకున్న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్), సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి మృతదేహం సమీపంలో రాడ్డును పోలీసులు కనుగొన్నారు. ఆమె తలపై గాయాలు ఉన్నాయి. ఈ హత్యకు సంబంధించి ఇర్ఫాన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. “దక్షిణ ఢిల్లీలో మాల్వియా నగర్‌లోని అరబిందో కళాశాల సమీపంలో 25 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైనట్లు మాకు సమాచారం అందింది. ఆమె మృతదేహం సమీపంలో ఇనుప రాడ్డు కనుగొనబడింది. ప్రాథమిక విచారణ ప్రకారం, బాలికపై రాడ్డుతో దాడి చేశారు. రక్తం ఆమె తల నుండి కారుతోంది. తదుపరి విచారణ పురోగతిలో ఉంది” అని పోలీసులు తెలిపారు.
“ఈ సంఘటన పార్క్ లోపల జరిగింది. మృతురాలు కళాశాల విద్యార్థిని. ఆమె తన స్నేహితుడితో కలిసి పార్కుకు వచ్చింది. మృతురాలి తలపై గాయాలు ఉన్నాయి” అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Also Read: Parliament Monsoon Session: మణిపూర్ హింసపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాల్వీయా నగర్ వంటి నాగరిక ప్రాంతంలో ఒక అమ్మాయిని రాడ్‌తో కొట్టి చంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి ఎవరికీ పట్టింపు లేదని ఆమె మండిపడ్డారు.