మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, భారత్కు చెందిన మరో నౌక గ్రీన్ ఆశా (Green Asha) సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. ఈ నౌక ఎల్పీజీ (వంట గ్యాస్) తీసుకెళ్తున్న ట్యాంకర్గా సమాచారం. ఈ సంఘటనతో, యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ మార్గాన్ని దాటిన భారత నౌకల సంఖ్య తొమ్మిదికి చేరింది. హోర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు మార్గాల్లో ఒకటి. అయితే ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ మార్గంపై కట్టుదిట్టమైన నియంత్రణ విధించింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకల్లో చాలా భాగం ఇరాన్కు సంబంధించినవే అని సమాచారం.
Also Read:SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..
అయినా కూడా భారత్కు చెందిన నౌకలు ఈ మార్గాన్ని వినియోగించడం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది భారత నౌకలు సురక్షితంగా దాటాయి. బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్ వంటి నౌకలు పెద్ద మొత్తంలో ఎల్పీజీ సరుకు తీసుకెళ్లాయి. పైన్ గ్యాస్, జగ్ వసంత్, శివాలిక్, నందాదేవి వంటి నౌకలు కూడా విజయవంతంగా ప్రయాణం పూర్తి చేశాయి.
ఇక భారత నౌకలకు సహాయం అందించేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉంది. ఇరాన్ కూడా “శత్రుత్వం లేని నౌకలకు” అనుమతి ఇస్తామని తెలిపింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకలకు ఈ అనుమతి ఉండకపోవచ్చు. ఈ యుద్ధ పరిస్థితులు ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఈ సంక్షోభం ఆరవ వారంలోకి చేరింది.
