Ladakh: ఘోర ప్రమాదం.. 9 మంది భారత జవాన్లు మృతి

Army

Army

Ladakh: లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని ఖేరీ సమీపంలో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాహనంలో 10 మంది సైనికులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జవాన్లు కేరే గ్యారిసన్‌ నుంచి లేహ్ సమీపంలోని ఖేరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఖేరీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

లడఖ్‌లో జరిగిన ప్రమాదం గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బందిని కోల్పోవడం బాధాకరమన్నారు. దేశానికి వారు చేసిన సేవలను మనం ఎప్పటికీ మరువలేమన్నారు. తమ ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని.. గాయపడిన సిబ్బందిని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.