Food Poision: మహారాష్ట్రలో విషాదం నెలకొంది. రాజ్గురునగర్ లోని హుతాత్మ రాజగురు విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తిన్న 61 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. గురువారం మధ్యాహ్నం విరామ సమయంలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పాఠశాలలోని కొంతమంది విద్యార్థులకు వికారం, కడుపునొప్పి రావడంతో ప్రిన్సిపాల్ అశోక్ నాగర్కర్ పిల్లలను సమీపంలోని చందోలి గ్రామీణ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ విక్రాంత్ చవాన్, తహసీల్దార్ డాక్టర్ వైశాలి వాగ్మారే, పోలీస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ కేంద్ర, గ్రూప్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీవన్ కొకనే తదితరులు విద్యార్థులకు చికిత్స అందించేందుకు తక్షణమే ప్రయత్నాలు చేశారు. మహేంద్ర గార్డ్ అతడి బృందం ఆధ్వర్యంలో 24 గంటల పాటు విద్యార్థులను ఆసుపత్రిలోనే ఉంచుతామని ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు.
Read Also: Itching Powder: మంత్రిపై దురద పౌడర్తో దాడి.. నిలిచిపోయిన రథయాత్ర, వీడియో వైరల్
హుతాత్మ రాజ్గురు విద్యాలయంలో 296 మంది విద్యార్థులు 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు. 61 మంది విద్యార్థులకు ప్రాథమికంగా విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రుల్లో భయానక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం ఇచ్చారు. ఎప్పటిలాగే విద్యార్థులు అన్నం తిన్నారు. చాలా మంది విద్యార్థులు భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో సబ్బు వాసన వచ్చిందని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆహారం తగ్గించారు. ఒకటిన్నర గంటలకు పాఠశాల ప్రారంభమైంది. రెండున్నర గంటల సమయంలో తరగతి గదిలో కూర్చున్న చాలా మంది పిల్లలకు కడుపునొప్పి, వికారంగా అంటూ కిందపడిపోయారు. వెంటనే గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులను చందోలి ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థుల చేరికతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. పౌష్టికాహారం తయారు చేసిన వారిపై కేసు పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.