Nankana Sahib Yatra: 3వేల మంది భారతీయులు పాకిస్థాన్కు వెళ్లబోతున్నారు. అవును మీరు చదువుతుంది నిజమే.. ఏప్రిల్లో 3,000 మంది భారతీయుల బృందం పాకిస్తాన్కు వెళ్లబోతుంది. పవిత్రమైన బైఖాసీ పండుగతో పాటుగా జరిగే ఈ యాత్ర ఏప్రిల్ 10వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఈ యాత్రలో భాగంగా భారత్ నుంచి వెళ్తున్న పర్యాటకులు పాకిస్థాన్లోని అనేక చారిత్రక, పవిత్ర గురుద్వారాలను సందర్శించనున్నారు. ఏప్రిల్ 14వ తేదీన పంజా సాహిబ్ గురుద్వారాలో జరిగే కార్యక్రమం ఈ పర్యటనలో ప్రధాన ఘట్టం కానుంది. ఈ యాత్ర విజయవంతం కావడానికి పాకిస్థాన్ ప్రభుత్వం, సంబంధిత సంస్థలు విస్తృతమైన సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఈసారి కూడా బైసాఖీ పవిత్ర పండుగ సందర్భంగా ఒక భారీ యాత్ర సరిహద్దు దాటబోతోంది. భారతదేశం నుంచి సుమారు 3,000 మంది సిక్కు భక్తులు తమ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి పాకిస్థాన్కు వెళ్లబోతున్నారు. నిజానికి ఈ యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు, కానీ ఈసారి దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిక్కు మతంలో ఈ యాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బైసాఖీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడతారు. ఈ పండుగ కోసం భారతదేశం నుంచి సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వస్తున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ ప్రతినిధి గులాం మొహియుద్దీన్ పీటీఐకి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇటీవల లాహోర్లోని పంజాబ్ హోం శాఖ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగిందన్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు ..
పీటీఐ నివేదిక ప్రకారం.. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి ఖవాజా సల్మాన్ రఫిక్, పాకిస్థాన్ సిక్కు గురుద్వారా పర్బందక్ కమిటీ అధిపతి సర్దార్ రమేష్ సింగ్ అరోరా హాజరయ్యారు. యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్ల గురించి ఈటీపీబీ అదనపు కార్యదర్శి (పుణ్యక్షేత్రాలు) నాసిర్ ముస్తాఖ్ మాట్లాడుతూ.. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు యాత్రికులు బైసాఖీ పండుగలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమయంలో యాత్రికుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా, వైద్య సౌకర్యాలు, మెరుగైన రవాణా, వసతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాత్ర కోసం భారతదేశం నుంచి 3,000 మంది యాత్రికులు ఏప్రిల్ 10వ తేదీన పాకిస్థాన్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యాత్రికులు నన్కానా సాహిబ్, ఫరూఖాబాద్, షేఖుపురా, కర్తార్పూర్, ఎమినాబాద్, లాహోర్తో సహా వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. యాత్రికులకు తగిన భద్రత, వైద్య సౌకర్యాలు, రవాణా సదుపాయాలను నిర్వహకులు కల్పించనున్నట్లు వెల్లడించారు.
బైసాఖీని ఎందుకు జరుపుకుంటారంటే..
బైసాఖీ కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదని, ఇది పంట కోత కాలం ప్రారంభాన్ని కూడా సూచిస్తుందని వారి నమ్మకం. ఈ రోజు సిక్కు సమాజానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే ఇదే రోజున ఖల్సా పంత్ స్థాపించారు. అందుకే ఈ సందర్భంగా గురుద్వారాలలో ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తారు. ఈ యాత్ర కేవలం మతపరమైనది మాత్రమే కాదని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, మానవతా సంబంధాలను బలోపేతం చేసే సాధనమని పాకిస్థానీ అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం, ఇటువంటి యాత్రలు రెండు దేశాల ప్రజలను మరింత దగ్గర చేయడానికి సహాయపడతాయన్నారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్కు వెళ్లే సిక్కు యాత్రికులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాకిస్థాన్కు వెళ్లే భక్తుల వీసా దరఖాస్తులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతానికి పైగా తగ్గినట్లు సమాచారం.
READ ALSO: Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!
