Tungabhadra Dam: కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19 గేటు.. స్పందించిన కర్నాటక డిప్యూటీ సీఎం

  • తుంగభద్ర డ్యామ్ లో 19 గేటు కొట్టుకుపోవడంపై తలలు పట్టుకున్న కర్ణాటక అధికారులు
  • తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం
  • తుంగభద్ర డ్యామ్ లో 60 టీఎంసీ లు ఖాళీ చేస్తేనే మరమ్మతులకు అవకాశం
  • ఇప్పటికే 29 గేట్ల ద్వారా లక్ష 8 వేలు క్యూసెక్కులు విడుదల
  • తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరం- డీకే శివకుమార్
  • వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తాం- కర్ణాటక డిప్యూటీ సీఎం.
Tungabadra Dam

Tungabadra Dam

కర్ణాటకలోని హోస్పేట్లో గల తుంగభద్ర జలాశయం ఉన్న 33 గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వాస్తవంగా తుంగభద్ర జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో.. కర్ణాటక అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ ప్రమాదం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం ఏర్పడనుంది.

Read Also: Palnadu: పోటెత్తిన పర్యాటకులు.. ఎత్తిపోతల జలపాతం చూసేందుకు

కాగా.. తుంగభద్ర డ్యామ్ లో 60 టీఎంసీలు ఖాళీ చేస్తేనే మరమ్మతులకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 29 గేట్ల ద్వారా లక్ష 8 వేలు క్యూసెక్కులు విడుదల చేశారు. ఐదారు రోజుల్లో 60 టీఎంసీలు దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలపై ప్రభావం పడనుంది. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే.. సీడబ్ల్యుసీ చైర్మన్ రవీంద్ర, డిప్యూటీ సీఎం శివకుమార్, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, విరుపాక్షి తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించారు.

Read Also: National Anthem: 14,000 గొంతులు ఒక్కసారిగా జనగణమన ఆలాపన.. గిన్నిస్ రికార్డు..

ఈ సందర్భంగా.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాట్లాడుతూ, తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరం అని అన్నారు. తుంగభద్ర డ్యామ్ కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచి.. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తాం.. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని తెలిపారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమే.. రైతులు సహకరించాలని డీకే శివకుమార్ చెప్పారు.