Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని 15 మ్యూజియంలకు తాజాగా బాంబు ఉన్నట్లు హెచ్చరికలు వచ్చినట్టు పోలీసులు ఇవాళ (బుధవారం) చెప్పుకొచ్చారు. ఈ మెయిల్స్ ద్వారా వార్నింగ్స్ వచ్చినట్టు పేర్కొన్నారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేపట్టారు. ఆయా మ్యూజియంలలో బాంబ్ స్వ్కాడ్తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే, సోదాల్లో భాగంగా ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని బాంబ్ స్వ్కాడ్ తెలిపింది.
Read Also: AP New Ministers: ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులు వీరే..
దీంతో బాంబ్ బెదిరింపులు బూటకమని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా, ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆస్పత్రులతో సహా ఎయిర్ పోర్టుకు సైతం వరుసగా బాంబ్ బెదిరింపులతో కూడిన ఈ మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, వరుస బాంబు బెదిరింపుల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఆందోళన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జన సందోహం ఎక్కువగా ఉండే ఏరియాల్లో పోలీసులు భద్రతను భారీగా పెంచేశారు.