Terror Incidents: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన రిపోర్టు ఇచ్చింది. 2017 నుంచి 2023 వరకు అంటే ఏడేళ్లలో ఏకంగా 1050 ఉగ్ర ఘటనలు నమోదయ్యాట. ఈ లెక్కలను కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. ఈ దాడుల్లో సామాన్యులతో పాటు భాద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఏడేళ్లలో జరిగిన 1050 దాడుల్లో 243 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మరో 599 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. ఇదే కాలంలో 288 మంది భద్రతా సిబ్బంది అమరులైనట్టు చెప్పారు. మరో 802 మంది గాయాలపాలయ్యారని చెప్పారు. అంతేకాదు.. ఈ దాడుల అనంతరం ఉగ్రవాదులను తుదముట్టించేందుకు చేపట్టిన ఆపరేషన్లలో 687 మంది ఉగ్రవాదులు మరణించారు. 616 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర సహాయక మంత్రి తెలిపారు. దేశ భద్రత కోసం దళాలు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు కాకోలీ ఘోష్ దస్తిదార్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. అయితే.. ఈ వివరాలు జాతీయ నేర గణాంకాల సంస్థ సేకరించిన సమాచారంపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగే నేరాల గణాంకాలను ఈ సంస్థ ప్రతి సంవత్సరం “క్రైమ్ ఇన్ ఇండియా” అనే నివేదికలో ప్రచురిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం 2023 సంవత్సరానికి సంబంధించినదని వెల్లడించింది.
READ MORE: Drone war: చిన్న సైజు.. భారీ విధ్వంసం..! డ్రోన్ యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?