ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. అమిత్ షా సమక్షంలో.. యోగి ఆధిత్యనాథ్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. రెండోసారి యూపీలో విజయం సాధించి… బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు అమిత్ షా. ఇక, తర్వాత గవర్నర్ ఆనంది బెన్ పటేల్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
Read Also: Bhatti Padayatra: మళ్లీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
మరోవైపు.. బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, అజయ్ దేవగణ్, బోనీ కపూర్ హాజరుకానున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్, చిత్రబృందం ప్రత్యేక అతిథులుగా ప్రమాణస్వీకారానికి రానున్నారు. పలువురు వ్యాపార దిగ్గజాలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఎన్. చంద్రశేఖరన్, ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, సంజీవ్ గొయెంకా తదితర పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. వీరిలో కొందరు ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది.
