NTV Telugu Site icon

Acid Attack: బైక్ పై వెళ్తున్న మహిళపై యాసిడ్ దాడి.. నిందితుడి అరెస్ట్

Acid Attack: అసోంలోని సోనిత్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైకుపై వెళ్తున్న మహిళపై యువకుడు యాసిడ్ పోయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సోనిత్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ సుశాంత బిస్వా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళ పని ముగించుకుని తన స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం ధేకియాజులిలో ఈ ఘటన జరిగింది. ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మహిళను నిందితుడు అడ్డగించాడు. వీరి మధ్య డబ్బు విషయమై కొంత కాలంగా విభేదాలు తలెత్తుతున్నాయి. వివాహితుడైన నిందితుడు అవివాహితైన సదరు మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తలెత్తిన వివాదంలో నిందితుడు మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ దాడిలో మహిళకు 15 శాతం గాయాలయ్యాయి. ఆమె మెడ, తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి. నిందితుడు వత్సుకర్ అనే వ్యాపారిగా గుర్తించాం. అతన్ని సోమవారం అరెస్టు చేసి ధర్యాప్తు చేపట్టినట్టు బిస్వా శర్మ తెలిపారు.