China Mega Dam: భారత్కు ఎంతో కీలకమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే మెగా డ్యామ్ నిర్మించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. టిబెన్లోని యార్లుంగ్ సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై డ్యామ్ నిర్మాణ పనుల్ని చైనా వేగం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ, జలవనరుల, వ్యూహాత్మక భద్రతపై ప్రభావం పడొచ్చని భారత్ భయపడుతోంది. యార్లుంగ్ సాంగ్పో టిబెట్లో పుట్టి, అరుణాచల్ ప్రదేశ్లోకి సియాంగా నదిగా ప్రవేశించి, ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంది. ఇది అస్సాంతో పాటు దేశంలోనే అనేక కోట్ల మందికి జీవనధారగా ఉంది. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల భారత ప్రయోజనాలకు భగం కలిగే అవకాశం ఉంది.
చైనా నిర్మిస్తున్న భారీ డ్యామ్ వల్ల నది సహజ ప్రవాహంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చైనా తనకు కావాల్సిన సమయంలో నది ప్రవాహాన్ని ఒక ఆయుధంగా భారత్పై వాడే అవకాశాలు లేకపోలేదు. దిగువ ప్రాంతాల్లో వరదలు లేదా కరువు పరిస్థితుల్ని సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నదీ ప్రవాహంపై చైనా పట్టు సాధిస్తే, ఎప్పుడైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే, ఈ నీటి ద్వారా భారత్ను నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి.
అయితే, చైనా మాత్రం భారత అభ్యంతరాలను లైట్ తీసుకుంటోంది. ఈ డ్యామ్ కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే అని, భారత్ సహా దిగువ ప్రాంత దేశాలకు ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గతంలో పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, 1986 లోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన వెలుగులోకి వచ్చిందని చెప్పారు. దిగువ ప్రాంతాల్లో నివసించే భారతీయుల జీవనాధారం, భద్రతకు ఎలాంటి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. చైనాతో ఈ విషయాన్ని భారత్ చాలా సార్లు లేవనెత్తింది. 2006లో ఏర్పాటైన నిపుణుల కమిటీ ద్వారా సరిహద్దు నదుల అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

