Rahul Gandhi: రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యం ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువస్తే ఇండియా కూటమి దీనికి వ్యతిరేకంగా నిలుస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
‘‘బీజేపీ ప్రజల ఆలోచనల్ని పరీక్షిస్తూనే ఉంది. వారు ఒక ఆలోచన అందించి, దానిపై ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తుంది. బీజేపీ ఎంపీల్లో ఒకరు నల్ల చట్టాలైన రైతు చట్టాలను పునరుద్ధరించడం గురించి దీని కోసమే మాట్లాడటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఉన్నారా లేదా.? అని మోడీజీ స్పష్టం చేయండి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ ఈ రైతు చట్టాలను పునరుద్ధరిస్తారా లేదా..? ఒక వేళ అదే జరిగితే ఇండియా కూటమి మీరు వ్యతిరేకంగా నిలుస్తుందని నేను హామీ ఇస్తున్నాను. 700 మంది అమరులయ్యారు, వీరిని గుర్తుంచుకోవాలి, మోడీజీ వారి కోసం రెండు నిమిషాలు మౌనం వహించలేదు. దీనిని ఎప్పటికీ మేము మరిచిపోము’’ అని అన్నారు.
Read Also: Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
‘‘ప్రభుత్వ విధానాలను ఎవరు నిర్ణయిస్తారు..? బీజేపీ ఎంపీ లేదా ప్రధాని మోడీ నా..? 700 మందికి పైగా రైతులు, ముఖ్యంగా హర్యానా, పంజాబ్కి చెందిన వారు బలిదానం చేసినా బీజేపీ సంతృప్తి చెందలేదు’’ అని పోస్టులో పేర్కొన్నారు. మా రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి కుట్ర చేైసినా ఇండియా కూటమి అనుమతించదని, రైతులను దెబ్బతీసేలా ఏదైనా చర్య తీసుకుంటే మరోసారి మోడీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
రైతుల నిరసనల నేపథ్యంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఈ చట్టాలను తీసుకురావాలని రైతులే డిమాండ్ చేయాలని, దేశాభివృద్ధికి రైతులే ముఖ్యమని అన్నారు. అయితే, బీజేపీ కంగనా వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పింది. ఈ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంది.